కేంద్రానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కితాబు
న్యూదిల్లీ: రెండేళ్ల క్రితం భారత్లో అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవన స్థాయులపై దెబ్బకొట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కితాబిచ్చింది. ‘పాండమిక్, పావర్టీ, ఇనీక్వాలిటీ: ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా’ పేరిట ఐఎంఎఫ్ ఒక పత్రాన్ని విడుదల చేసింది. ‘2019లో భారత్లో తీవ్ర పేదరికం ఒక శాతం(ఒక వ్యక్తికి రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తి) కంటే దిగువన ఉంది. 2020లో మహమ్మారి ఆ దేశంలో అడుగుపెట్టిన ఏడాదిలో కూడా అది స్థిరంగానే ఉంది. భారత్లో తీవ్రమైన పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కీలకంగా మారింది. కొవిడ్ షాక్లకు గురైన పేదల విషయంలో ఈ పథకం మెరుగ్గా పనిచేసింది. ఇలా తాత్కాలికంగా ఏర్పడిన ఆదాయ అంతరాల నుంచి బయటపడేసేందుకు తాత్కాలిక ఆర్థిక విధాన జోక్యం తగినది’ అని ఐఎంఎఫ్ వెల్లడిరచింది. కరోనా వేళ 2020 మార్చిలో కేంద్రం ఈ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనికింద దేశ ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించి, ఆహార భద్రతను కల్పించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు గత నెల ప్రధాని ప్రకటించారు. ఇక వరుసగా రెండు సంవత్సరాల పాటు తక్కువ స్థాయి పేదరికాన్ని తీవ్ర పేదరిక నిర్మూలనగా పరిగణిస్తారు.