Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆ దేశాలకు అండగా ‘ఐరిస్‌’

ఆవిష్కరించిన మోదీ

గ్లాస్గో : గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పు ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న ద్వీపాలపై ఈ ప్రభావం మరింత దారుణంగా ఉందన్నారు. గ్లాస్గోలో జరుగుతున్న ఐరాస వాతావరణ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు ఐరిస్‌ (ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ రిసీలియంట్‌ ఐలాండ్‌ స్టేట్స్‌)ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ద్వీపాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. వాతావరణ మార్పుతో ఏర్పడే విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా దేశాలతో ఇస్రో పంచుకుంటుందన్నారు. ‘ఐరిస్‌.. నూతన ఆశలు, నమ్మకాన్ని కలిగిస్తుంది. వాతావరణ మార్పుతో అత్యంత దారుణంగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేసేందుకు ఐరిస్‌ ఉపయోగపడుతుంది. వాస్తవానికి వాతావరణ మార్పులతో గత దశాబ్ద కాలంగా ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, సహజసిద్ధ వనరులున్న దేశాలూ ముప్పు బారినపడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మనం అందరం చేసుకున్నదే. అందువల్ల మానవజాతి మనుగడకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్న ద్వీపాలపై వాతావరణ మార్పు ప్రభావం దారుణంగా ఉంది. వీరికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ అండగా నిలుస్తుంది. ప్రకృతి విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా ద్వీపాలతో ఇస్రో పంచుకుంటుంది’ అని మోదీ అన్నారు. విపత్తు ప్రతీఘాతుక మౌలికసదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ) చొరవకు మోదీ అభినందనలు తెలిపారు సీడీఆర్‌ఐ లేదా ఐరిస్‌ కేవలం మౌలిక సదుపాయాలకు సంబంధించినది కాదని, ఇది మానవ సంక్షేమానికి సంబంధించిన సున్నితమైన బాధ్యతలో భాగమని అన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ ప్రధాని జాన్సన్‌ మాట్లాడుతూ.. భూతాపం వల్ల కలిగే నష్టంలో బలహీనమైన, చిన్న ద్వీప దేశాలు ముందు వరుసలో ఉండటం బాధాకరమన్నారు. వాస్తవంగా ఆయా దేశాలు సమస్య ఉత్పన్నం కావడానికి చేసిందేమీలేదు.. వారు వాతావరణంలోకి పెద్దస్థాయిలో కర్బన ఉద్గారాలను చొప్పించలేదని చెప్పారు ఐరిస్‌ చొరవకు బ్రిటన్‌ ఆర్థికంగా సహకరిస్తోందని జాన్సన్‌ చెప్పారు. సీడీఆర్‌ఐకి నాయకత్వం వహించినందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి భారత్‌, బ్రిటన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img