10న విచారణకు హాజరుకండి
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు షోకాజ్ నోటీసు
ముంబై : కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు ముంబైలోని తీరప్రాంత నిర్వహణ సంస్థ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నగరంలోని జుహు ప్రాంతంలో ఉన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బంగ్లా ‘ఆధీశ్’ అనధికారిక నిర్మాణం అని ముంబై నగర పాలక సంస్థ సైతం పేర్కొన్నట్టు ఆ నోటీసుల్లో తెలిపింది. గతంలో ఆయన తన బంగ్లా క్రమబద్దీకరణ కోసం చేసిన ప్రతిపాదనను ఆ సంస్థ తిరస్కరించిన విషయాన్ని కూడా పేర్కొంటూ ఈ నెల 24న నోటీసు ఇచ్చింది. నిర్మాణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదని మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజిమెంట్ అథారిటీ డైరెక్టర్ పర్యావరణ శాఖ కార్యదర్శికి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అనుమతులు లేనందున దాన్ని అనధికారిక నిర్మాణంగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై జూన్ 10న ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరై సరైన ఆధారాలు అందించాలని లేని పక్షంలో విచారణ కమిటీ అందుకు తగ్గ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది