రాష్ట్రాలకు కేంద్రం పిలుపు
న్యూదిల్లీ : దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రమాదం ముగిసిపోయిందని అనుకోవద్దని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ హెచ్చరించారు. గురువారం దిల్లీలో రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా వాక్సిన్ కార్యక్రమం, వ్యాధి వ్యాప్తి గురించి చర్చించారు. కేంద్రం వాక్సినేషన్ కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లేందుకు హర్ ఘర్ దస్తక్ (ఇంటింటికీ టీకా) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు, యూటీలు వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. 12 కోట్ల మంది లబ్ధిదారులు తమ రెండవ డోస్ కోవిడ్-19 వాక్సిన్ను తీసుకోవాల్సి ఉందన్న మంత్రి.. ఇంటింటికీ టీకా కార్యక్రమంలో వీరితోపాటు అర్హులందరికీ మొదటి డోసు వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులకు సూచించారు.
కోవిడ్ తీవ్రత ముగిసినట్లు భావించకూడదని, వైరస్ నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ‘జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలి. కరోనా ముగిసిందని భావించకూడదు. అంతర్జాతీయంగా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి హర్ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని నిశితంగా పర్యవేక్షించాలి. తద్వారా దేశంలో ప్రతి ఇంటికీ టీకాలు అందించాలి. జిల్లాల్లో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి కోవిన్ను ఉపయోగించవచ్చునన్నారు. కాగా దేశంలోని వయోజన జనాభాలో 79.2 శాతం మంది కనీసం ఒక డోస్ కోవిడ్ వాక్సిన్ని పొందారని, దేశంలోని 94 కోట్ల వయోజన జనాభాలో 37 శాతానికి పైగా రెండు డో¸సుల వాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 110.23 కోట్ల వాక్సిన్ డోస్లను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 1,20,08,58,170 వ్యాక్సిన్ డోస్లను ఉచితంగా అందించిందని కేంద్ర మంత్రి వెల్లడిరచారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ అత్యధిక డోసులు అందించిన మొదటి ఐదు రాష్ట్రాలుగా ఉన్నాయి.