పనాజీ : సంక్షోభ సమయాల్లో సత్వర స్పందన, ప్రభావశీల మోహరింపు ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా భాగస్వామి, మొదటి స్పందనదారుగా ఉండాలనే దేశ ఆకాంక్షను నౌకాదళం స్పష్టం చేసిందని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పేర్కొన్నారు. గోవాలో మూడురోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి సోమవారం పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో వాస్కో పట్టణంలో ఉన్న ఐఎన్ఎస్ హంసా స్థావరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో నావల్ ఏవియేషన్కు ప్రెసిడెంట్ కలర్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి భారత నౌకాదళం గౌరవ వందనం సమర్పించింది. గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ కలర్ అనేది దేశానికి అందించిన అసాధారణ సేవకు గుర్తింపుగా ఒక సైనిక విభాగానికి అందించే అత్యున్నత గౌరవం. ఇది 36 అంగుళాల నుంచి 48 అంగుళాల తెల్లని చిహ్నంతో జాతీయ జెండాను కలిగి ఉంటుంది. చిహ్నం మధ్య భాగం బంగారంతో ఎంబ్రాయిడరీ చేయబడిరది. భారతీయ సాయుధ దళాలలో మొట్టమొదటిసారి నావికాదళానికి మే 27, 1951 న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత రాష్ట్రపతి కలర్ అవార్డును ి ప్రదానం చేశారు. ‘‘నేవీలో ప్రెసిడెంట్ కలర్ అందుకున్న వారిలో దక్షిణ నావల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, వెస్ట్రన్ నావల్ కమాండ్, ఈస్టర్న్ ఫ్లీట్, వెస్ట్రన్ ఫ్లీట్, సబ్ మెరైన్ ఆర్మ్, ఐఎన్ఎస్ శివాజీ, ఇండియన్ నేవల్ అకాడమీ ఉన్నాయి’’ అని నావికాదళ ప్రతినిధి తెలిపారు. జనవరి 13, 1951 న మొట్టమొదటి సీలాండ్ విమానాన్ని కొనుగోలు చేయడం, మే 11, 1953 న మొదటి నావల్ ఎయిర్ స్టేషన్ అయిన ఐఎన్ఎస్ గరుడను ప్రారంభించడం ద్వారా ఇండియన్ నేవల్ ఏవియేషన్ ఏర్పడిరది. ప్రస్తుతం భారత నౌకాదళ విమానయాన పరిథిలో భారతీయ తీరప్రాంతం, అండమాన్, నికోబార్ దీవులలో తొమ్మిది ఎయిర్ స్టేషన్లు, మూడు నౌకాదళ ఎయిర్ ఎన్క్లేవ్లు ఉన్నాయి.