ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ (71) సోమవారం నాడిక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. దేశ్ముఖ్ తన న్యాయవాది, సహచరులతో కలిసి ఉదయం 11:40 గంటలకు దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో గల ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఐదుసార్లు ఈడీ విచారణకు గైర్హాజరైన దేశ్ముఖ్.. గత వారం బాంబే హైకోర్టు ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించడంతో విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్రలో రూ.100 కోట్ల లంచం, బలవంతపు వసూళ్ల కుంభకోణంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద దర్యాప్తునకు సంబంధించి దేశ్ముఖ్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో దేశ్ముఖ్ కీలక వ్యక్తి అని, ఈ కేసులో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే వెల్లడిరచిన వివరాలతో సహా అనేక విషయాలపై లోతుగా ప్రశ్నించాల్సి ఉందని అధికారులు చెప్పడంతో దేశ్ముఖ్ విచారణ సుదీర్ఘ సమయం కొనసాగనుందని భావిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు దేశ్ముఖ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తానే ఈడీ ముందు హాజరవుతున్నానని తెలిపారు. ‘నేను ఈడీకి సహకరించడం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి…నాకు సమన్లు అందిన తర్వాత రెండుసార్లు సీబీఐ వద్దకు వెళ్లాను…నా పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉంది.. దానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి నేనే స్వయంగా ఈడీ వద్దకు వెళ్లాను’ అని పేర్కొన్నారు. ఈడీ తన ఇంటిపై దాడిచేసినప్పుడు తాను, తన కుటుంబం వారికి సహకరించామని తెలిపారు. తనపై లంచం ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఎక్కడున్నారని దేశ్ ముఖ్ ప్రశ్నించారు.