వారణాసి కమిషనర్ అంగీకారం
వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో ఏ పార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు 48 గంటల ముందు ఈవీఎంలను అక్రమంగా తరలించారని, ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇది తాజా వివాదానికి దారితీసింది. అఖిలేశ్ వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఇలా జరగడం వాస్తవమేనని ఓ అధికారి చెబుతున్న వీడియోను సమాజ్వాదీ పార్టీ ట్వీట్ చేసింది. ఈవీఎంలు తీసుకువెళ్లడం, ప్రొటోకాల్ను ఉల్లంఘించడం నిజమేనని వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అది శిక్షణలో భాగంగా జరిగిందని ఆయన అంటున్నారు. అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఈవీఎంల తరలింపునకు సంబంధించి ప్రొటోకాల్ గురించి మీరు మాట్లాడినట్లయితే అతిక్రమణ జరిగిందని ఒప్పుకుంటున్నా…కానీ ఓటింగ్ యంత్రాలు తీసుకెళ్లడం అసాధ్యం. దీనిపై నేను మీకు హామీనిస్తున్నా’ అని అన్నారు. సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, పార్టీల ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్నట్లు తెలిపారు. నిఘా ఉంచేందుకు ఆయా కేంద్రాల బయట రాజకీయ పార్టీల కార్యకర్తలు కూర్చోవచ్చునని కమిషనర్ చెప్పారు. కమిషనర్ మాటల్లో ప్రొటోకాల్ పాటించలేదన్న అంగీకారం ఉందని ట్విట్టర్లో ఎస్పీ వ్యాఖ్యానించింది. ‘వివిధ జిల్లాల్లో ఈవీఎంల ఉల్లంఘనలు జరిగినట్లుగా సమాచారం ఉంది. ఇది ఎవరి ఆదేశాలతో జరుగుతోంది? సీఎం యోగి కార్యాలయం నుంచి ఒత్తిడికి అధికారులు తలొగ్గుతున్నారా? దీనిపై ఎన్నికల కమిషన్ స్పష్టతివ్వాలి’ అని ఎస్పీ పేర్కొంది. .