ఈశాన్య రాష్ట్రాలను సిత్రాంగ్ తుఫాన్ వణికిస్తున్నది. ఆసోం, పశ్చిమ బెంగాల్ సహా మేఘాలయ, మిజోరంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సిత్రాంగ్ కారణంగా నాలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. సోమవారం బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించిన తుఫాన్.. అక్కడ దాదాపు 11 మందిని బలిగొన్నది.బంగ్లాదేశ్ తీర ప్రాంతాన్ని తాకిన అనంతరం సిత్రాంగ్ తుఫాను భారతదేశాన్ని తాకింది. అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురలో వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. మరోవైపు త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మీదుగా గంటకు 100-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గౌహతిలో మంగళవారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల యోగక్షేమాలపై దృష్టిపెట్టాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. 24 పరగణాల జిల్లాలోని బక్హాలీ బీచ్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే మోహరించారు.