కేంద్రం
న్యూదిల్లీ : దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పని చేస్తోన్న 25 కోట్ల మంది కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం పార్లమెంటులో ప్రకటన చేశారు. అసంఘటిత రంగ కార్మికుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి మాట్లాడుతూ...దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు 160 రకాల వృత్తుల్లో ఉంటారని ప్రభుత్వం అంచనా వేసిందని అయితే సుమారు 400 రకాలైన వృత్తుల్లో ఆ రంగం కార్మికులు ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం కోసం వారి వివరాలను ఈ
శ్రమ్ పోర్టల్ ద్వారా సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికి 25 కోట్ల మంది కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. కేంద్రం అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని పేర్కొన్నారు. వారిలో మూడో వంతు కార్మికుల సమాచారం ఇప్పుడు ప్రభుత్వం వద్ద రికార్డు అయిందని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించేముందు తాము 160 రకాల వృత్తుల్లో అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని భావించామని, అయితే పోర్టల్ ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ వృత్తుల సంఖ్య 400 దాకా ఉంటోందని తెలిపారు. 400 రకాల వృత్తుల వారిని ఈ`శ్రమ్ పోర్టల్లో నమోదు చేయిస్తున్నామని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక భద్రత కోసం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.