సుప్రీంలో పిటిషన్
న్యూదిల్లీ : స్థానికులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 75శాతం కోటాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ.. హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్టే విధించాలన్న ఈ నిర్ణయాన్ని సమర్థించలేమని, అసాధారణమైనదని ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లను కల్పించే రాష్ట్ర ప్రభుత్వ చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం మధ్యంతర స్టే విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్వీ. రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులను రికార్డులో ఉంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను జాబితా చేసేందుకు అంగీకరించింది. కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే ఈ అంశంపై వాదనలు జరిగాయని.. వెంటనే హైకోర్టు ఆదేశాలను జారీ చేసిందని పిటిషన్లో పేర్కొంది. హైకోర్టులో రాష్ట్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించలేదని తెలిపింది.