పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేసే అంశంపై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఓ ప్రకటన చేశారు.పార్లమెంట్ సమావేశాలు ఉన్నా, లేకపోయినా.. దర్యాప్తు ఏజెన్సీల నుంచి సమన్లను అందుకున్న సభ్యులు దానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. చట్టాలు, లీగల్ ప్రొసీజర్లను గౌరవించాల్సిన బాధ్యత.. సమన్లను అందుకున్న సభ్యులపై ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సభ్యులు కూడా చట్టం, న్యాయానికి లోబడి ఉన్న పౌరులేనని అన్నారు. క్రిమినల్ ఆరోపణలు ఉన్న కేసుల్లో.. ఆ ఎంపీలకు సభ ఎటువంటి రక్షణ కల్పించలేదని వెంకయ్య తెలిపారు. సభకు హాజరుకావాలన్న ఉద్దేశంతో కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చైర్మెన్ చెప్పారు. చట్టాన్ని, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన విధిగా భావించాలని వెంకయ్య తెలిపారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.