పనాజీ: గోవాలో 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం సమర్థించింది. గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ 2019 జూలైలో బీజేపీలోకి ఫిరాయించిన 10 మంది పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేశారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ధవలికర్ కూడా అదే ఏడాది ప్రాంతీయ పార్టీని చీల్చి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కూడా ఇదే తరహా పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేష్ పట్నేకర్ గతేడాది ఏప్రిల్ 20న చోడంకర్, ధవలికర్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను త్రోసిపుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు నేతల పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు మనీష్ పితలే, ఆర్ఎన్ లడ్డాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్లు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ సరిగానే విచారించారని తెలిపింది.అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉందని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.