Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎమ్మెల్యే హత్య కేసు సాక్షి మర్డర్.. మరో నిందితుడ్ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

యూపీలో సంచలనం రేపిన ప్రయాగ్ రాజ్‌లోని ఉమేశ్ పాల్ హత్య కేసులో మరో నిందితుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్‌లో నిందితుడు విజయ్‌ అలియాస్‌ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినట్లు పోలీసులు ప్రకటించారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌పై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్‌ షూటర్లలో ఉస్మాన్‌ ఒకడు. అతడే నేరుగా ఉమేశ్‌ను కాల్చినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. పారిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకొంది.2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో గతవారం నడిరోడ్డుపై కాల్చిచంపిన విషయం తెలిసిందే. కారులో అంగరక్షులతో కలిసి వెళ్తోన్న అతడ్ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉమేశ్‌ పాల్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉమేశ్ భార్య జయ పాల్‌ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ , అతడి సోదరుడు అష్రఫ్‌, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిని నిందితులుగా చేర్చారు.2004 యూపీ ఉప-ఎన్నికల్లో అలహాబాద్-పశ్చిమ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన రాజు పాల్.. అతీక్‌ అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజిమ్‌పై విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే రాజు పాల్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అతీక్‌ అహ్మద్‌ ప్రస్తుతం గుజరాత్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాజుపాల్‌ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉమేశ్ పాల్‌‌ను గతంలో అతీక్‌ అహ్మద్ అనుచరులు కిడ్నాప్‌ చేశారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటీవల ఉమేశ్‌ను అతడి ఇంటికి సమీపంలో దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.బీజేపీ పాలనలో రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పు ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ హత్యపై అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ (ఖూ) ప్రభుత్వం.. ఇటీవల అతీక్‌ అనుచరుడి ఇంటిని కూల్చేసింది. ఉమేశ్ పాల్‌ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితులపై రివార్డు ప్రకటించారు. నేరస్థులను నలిపి పారేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img