సీఎం షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనను, తన కుటుంబాన్ని దూషించిన వారికి ఠాక్రే కుటుంబంపై గౌరవం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.శివసేన పార్టీ గుర్తును రెబల్స్ ఉపయోగించుకునే అవకాశమే లేదన్నారు. తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్నాథ్ శిండేను ఆహ్వానించాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా సోమవారం విచారణ జరగనుంది.