న్యూదిల్లీ: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) నిబంధనలకు అనుగుణంగా నాలుగు కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు కేంద్ర కార్మికశాఖమంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. పీటీఐ ఎంప్లాయీస్ యూనియన్స్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోని కార్మికుల సామాజిక భద్రత, వృత్తిపరమైన ఇబ్బందులు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో నాలుగు లేబర్ కోడ్ల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని, సాధ్యమైనంత త్వరలో ఇది పూర్తవుతుందని, లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని మంత్రి యాదవ్ వెల్లడిరచారు. లేబర్ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నదని, అందువల్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన విధానాలు రూపొందిస్తాయని, చట్టాలు తీసుకొస్తాయని వివరించారు. వివిధ రంగాలకు సంబంధించి వేతన బోర్డులను చట్ట ప్రకారం త్వరలోనే ఏర్పాటు చేస్తామని యాదవ్ తెలిపారు. దేశంలో 38 కోట్లమంది అసంఘటితరంగంలో పనిచేస్తున్నారని, అందులో 27 కోట్లమంది ఆధార్తో ఈ`శ్రమ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ 27 కోట్లమంది ప్రజలు 400 రకాల వృత్తుల్లో ఉన్నారన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వృత్తిపరమైన పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికిగాను వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955ను అమలు చేయాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బలరామ్సింగ్ దహియా, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు(ఐఎఫ్డబ్ల్యూజే) నేత కె.విక్రమ్రావు విజ్ఞప్తి చేశారు. అపరిష్కృత సమస్యల సత్వర పరిష్కారం కోసం మీడియా మిత్రుల కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.