భువనేశ్వర్: నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఎన్నికల జరిగాయని అధికారులు తెలిపారు. 1,254 పంచాయతీల్లోని 17,089 బూత్ల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 1 వరకూ జరిగిందని పేర్కొన్నారు. మొత్తంగా 51.31 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఈ దశలో 163 జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకునున్నారు. మొదటి మూడు దశల్లో చెలరేగిన హింసను దృష్టిలో ఉంచుకున్న అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మొదటి దశల్లో బూత్ రిగ్గింగ్, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, హింస తలెత్తడంలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. 1,473 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, జిల్లా పోలీసులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సరళిని పరిశీలించినట్టు పేర్కొన్నారు. కోరాపుట్, మల్కాన్గిరి, ఖందమాల్లాంటి మావోయిస్టు ప్రభావం ఉన్న జిల్లాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టు రాష్ట్ర ఎన్నిక కమిషనర్ ఏపీ పధి తెలిపారు.