న్యూదిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శనివారం ఆందోళన వెలిబుచ్చారు. ఒమిక్రాన్ వేగవంతంగా విస్తరణ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలకు వాక్సిన్ భద్రత కల్పించాలని మోదీ సర్కారుకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఒమిక్రాన్ విస్తరణ చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన వేళ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొత్త వేరియంట్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని నామకరణ చేసిన విషయం విదితమే. ‘కొత్త వేరియంట్ తీవ్ర ప్రమాదంగా పరిణమిస్తోంది. దీని నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. కొత్త ఔషధాలను అన్వేషించాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఎంతమందికి వాక్సినేషన్ వేసింది కచ్చితమైన ఆధారాలు వెల్లడిరచాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక మనిషి ఫొటోతో వాస్తవ సంఖ్యను ఎంతోకాలం దాచలేరని పేర్కొన్నారు. కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ముద్రిస్తుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం దేశ జనాభాలో ఇప్పటికి 31.19శాతం మందికి మాత్రమే వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన విషయాన్ని రాహుల్ షేర్ చేశారు.