న్యూదిల్లీ : దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి మీరు తీసుకోనున్న చర్యలు ఏమిటి? ఎలాంటి ప్రణాళికలను ఆచరించదలిచారు? బూస్టర్ డోస్పై ఎప్పుడు నిర్ణయిస్తారు? చిన్నారుల వాక్సినేషన్పై మీ వైఖరి ఏమిటి? అంటూ కేంద్రప్రభుత్వాన్ని లోక్సభ సభ్యులు మంగళవారం ప్రశ్నించారు. ఒమిక్రాన్ కోరలు చాస్తున్న వేళ మరింత అప్రమంగా ఉండటమే కాకుండా ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 41కు చేరుకుందని, చిన్నారులకు, యుక్తవయస్సు వారికి వాక్సిన్లు ఇచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో చిన్నారులకు వాక్సినేషన్ మొదలైందన్నారు. ఒమిక్రాన్ ఇతర రాష్ట్రాలకు వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి ప్రభుత్వం బూస్టర్ డోసులు ఇవ్వడాన్ని తక్షణమే ప్రారంభించడం మంచిదని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతా రాయ్ సూచించారు. నిపుణుల కమిటీలో అభిప్రాయభేదాల కారణంగా బూస్టర్ డోసును ఇవ్వడం లేదన్నారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే ఒమిక్రాన్ను ఎమర్జెన్సీగా ప్రకటించారని, లండన్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ క్రమంలో మన దేశంలో మూడవ దశ పొంచివున్నదన్న భయాందోళనలు నెలకొన్నాయని రాయ్ అన్నారు. బ్రిటన్లో ఒమిక్రాన్ తొలి మరణం నమోదు అయిందని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ కట్టడికి, ప్రజారోగ్య సంరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పండని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.