యడియూరప్ప, సిద్దరామయ్య, శివకుమార్, కుమారస్వామి కుమ్మక్కు
బీజేపీ సీనియర్ నేత యత్నాల్ విమర్శ
న్యూదిల్లీ: రాజకీయాలకతీతంగా కొంతమంది సీనియర్ నాయకులు కర్ణాటకలో సర్దుబాటు రాజకీయాలకు తెరలేపారని బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. బీజేపీ నాయకుడు బీఎస్ యడియూరప్ప, కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి వంటి వేర్వేరు పార్టీల అగ్రనాయకుల మధ్య సర్దుబాటు రాజకీయాలు చోటుచేసుకున్నాయని శుక్రవారం ఆయన మండిపడ్డారు. ఆ నాయకులు పరస్పరం సహకరించుకుంటున్నట్లు విజయపుర సిటీ ఎమ్మెల్యే కూడా అయిన యత్నాల్ అన్నారు. అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చునే ఈ నాయకులు సీట్లను సైతం సర్దుకుంటున్నారని తెలిపారు. యడియూరప్ప, సిద్దరామయ్య, డీకే శివకుమార్, కుమారస్వామి రాత్రి వేళ నిత్యం మంతనాలు సాగిస్తున్నట్లు ఆక్షేపించారు. యత్నాల్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సొంతపార్టీ నేత బీఎస్ యడియూరప్ప లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. వెనుక సీట్లో కూర్చునే తనవంటి శాసనసభ్యుల మాటల్లో విశ్వసనీయతను గుర్తించాలని పేర్కొన్నారు. ఆయా పార్టీల నేతలను ఆ నలుగురు పిచ్చివాళ్లను చేస్తున్నట్లు తెలిపారు. ‘మీ డ్రామా కంపెనీ మూసేయాలని వారికి చెబుతున్నాను. యడియూరప్ప సీఎంగా ఉండగా ఆయన నియోజకవర్గం శికరిపుర తర్వాత అంతగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న బదామీ మాత్రమేనని, ఆ తర్వాత శివకుమార్ నియోజకవర్గమని యత్నాల్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా బొమ్మై తన నియోజకవర్గం అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారని చెప్పారు. యడియూరప్పకు యత్నాల్ బీజేపీలో ఆగర్భ శత్రువుగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన రమేశ్ జర్కిహోలీ తిరిగి మంత్రివర్గంలోకి రావాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సెక్స్ సీడీ కుంభకోణం కారణంగా రమేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. రమేశ్పై పెద్ద కుట్ర జరిగిందని, డీకే శివకుమార్ వంటి కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి తమ పార్టీలో పెద్దనాయకుడి కుమారుడు ఈ కుట్రకు పాల్పడినట్లు ఆరోపించారు. బీజేపీలో ఒక మనిషికి ఒకే పదవి విధానం..ఒక కుటుంబానికి ఒకే టికెట్ కూడా వస్తుందని, దీనివల్ల పార్టీలో ఇతర నాయకులు పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని యత్నాల్ చెప్పారు.