Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే : దిల్లీ హైకోర్టు

ఈ పరీక్షకు శాస్త్రీయతలేదని సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పిందన్న హైకోర్టు
క్రైస్తవ సన్యాసిని మృతి కేసులో తీర్పు

కన్యత్వ పరీక్షలపై మంగళవారం దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలకు కచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనమే లేదని పేర్కొంది. అయినప్పటికీ ఈ పరీక్ష మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారిందని తెలిపింది. మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమని, సుప్రీంకోర్టు కూడా ఈ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఈమేరకు 1992లో క్రైస్తవ సన్యాసిని (నన్‌) మృతి కేసు విచారణలో భాగంగా తనకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారంటూ సెఫీ అనే మరో నన్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మహిళా నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం దర్యాప్తులో భాగం కాబోదు, కస్టడీలో ఉన్న నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమే. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఆర్టికల్‌ 21 ఉల్లంఘనే’ అని న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ పేర్కొన్నారు. కస్టోడియల్‌ డిగ్నిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మహిళలు గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img