ఆరుగురు ముస్లిం విద్యార్థుల సస్పెన్షన్
దక్షిణ కన్నడ కాలేజి వద్ద నిరసనలు ` జర్నలిస్టులపై దుండగుల దాడి
మంగళూరు : కర్ణాటకలో మరోమారు హిజాబ్ వివాదం తెరపైకొచ్చింది. హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థులను దక్షిణ కన్నడ కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఉప్పినంగడి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాకల్టీతో సంప్రదింపులు అనంతరం ఆరుగురు ముస్లిం విద్యార్థులను ప్రిన్సిపాల్ వారం పాటు సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా యూనిఫారాన్ని విద్యార్థులు ధరించాల్సి ఉంది. క్యాంపస్ల్లో హిజాబ్పై నిషేధం ఉంది. ఇదే క్రమంలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి రావడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని యూనివర్సిటీ నిర్వాహకులు వెల్లడిరచారు. యాజమాన్యం, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని ప్రిన్సిపల్ తీసుకున్నట్టు తెలిపారు.
విద్యార్థులను సస్పెండ్ చేసిన మరుసటి రోజు అంటే గురువారం ఇంకొందరు హిజాబ్ ధరించి కాలేజికి రాగా హిందువులైన విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనకు దిగారు. హిజాబ్ ధరించే వారిని తరగతి గదుల్లోకి అనుమతించవద్దని డిమాండు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హిజాబ్ ధరించిన వారినిగానీ, కాషాయ కండువాలు ధరించిన వారినిగానీ తరగతి గదుల్లోకి అధికారులు అనుమతించలేదని కాలేజి వర్గాలు తెలిపాయి. మరోవైపు వార్తా సేకరణకు వచ్చిన జర్నలిస్టులను ఆగంతకులు కొందరు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి కెమెరాలను లాక్కొని అందులోని ఫుటేజిని తొలగించారు. దీంతో దుండగులపై చర్యలకు స్థానిక జర్నలిస్టు సంఘం డిమాండు చేసింది. జిల్లా డిప్యూటీ కమిషనర్తో పాటు ఎస్పీని కలిసి మెమోరాండాలు సమర్పించింది. గతవారం వెలుగులోకి వచ్చిన మంగళూరు యూనివర్సిటీ కాలేజిలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హెడ్స్కాఫ్తో వచ్చిన 15 మంది విద్యార్థినులను తరగతి గదుల్లోకి యాజమాన్యం అనుతించలేదు. హెడ్స్కాఫ్ లేకుండా రావాలని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ఫలించలేదు.