ధార్వాడ్ : కర్ణాటకకు చెందిన ధార్వాడ్లోని ఎస్డీఎం వైద్య కళాశాల ఆస్పత్రికి చెందిన మరో 116 మందికి కోవిడ్`19 పాజిటివ్గా తేలింది. దీంతో ఈ కళాశాలలో మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. తొలుత 66 మంది వైద్య విద్యార్థులకు మహమ్మారి సోకిన తర్వాత కళాశాలకు చెందిన రెండు హాస్టళ్లను గురువారం మూసివేశారు. విద్యార్థులు, సిబ్బందితో సహా ప్రాథమిక కాంట్రాక్టులు కలిగి ఉన్న 690 మందికి ఇప్పటి వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితేష్ పాటిల్ గురువారం మాట్లాడుతూ దాదాపు వారం క్రితం జరిగిన ఒక విద్యార్థుల కార్యక్రమమే కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి దారితీసి ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి కొంతమంది తల్లిదండ్రులు కూడా హాజరయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వారందరినీ కూడా పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరామని అధికారులు చెప్పారు. కాగా కోవిడ్ పాజిటివ్ సోకిన వారందరూ ఐసోలేట్ అయ్యారని, అయితే మహమ్మారి సోకిన వారందరూ టీకాలు పొందినవారేనని, వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించారు.