లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఆజంఖాన్ జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. .మరో వార్త కూడా వచ్చి చేరింది. కాంగ్రెస్లో చేరాలని అజంఖాన్ ఆయనపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ఏకంగా కాంగ్రెస్ పక్షాన ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. స్వాగతం.. స్వాగతం.. అంటూ కాంగ్రెస్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయనను కాంగ్రెస్ దువ్వుతోందని స్పష్టమవుతోంది. ప్రయాగరాజ్ ముస్లిం లీడర్ ఇర్షద్ ఉల్లా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలో ప్రియాంక గాంధీతో పాటు యూపీ ప్రముఖులు కూడా ఉండటంతో రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇంకో ఆసక్తి ఏమిటంటే ఆచార్య ప్రమోద్ క్రిష్ణమ్ ఫోటో కూడా ఉంది. ఆయన ఆజంఖాన్తో జైల్లో ములాఖాత్ కూడా అయ్యారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ చాలా తెలివిగా స్పందించింది. ఆజంఖాన్ కేవలం సమాజ్వాదీ పార్టీ నేతే కాదని, రాష్ట్రంలో సీనియర్ నేత అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి పేర్కొన్నారు. ప్రయాగరాజ్లో ఆయన నేతృత్వంలో కుంభమేళాను కూడా విజయవంతం చేశారని తెలిపారు. బీజేపీ దురదృష్టవశాత్తు ఆయనపై కేసులు మోపుతోందని, అయినా సొంత పార్టీ సమాజ్వాదీ మాత్రం ఈ కేసులకు వ్యతిరేకంగా పోరాటమే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజ్వాదీ పార్టీ అధిష్ఠానంపై ఆజంఖాన్ సీరియస్గా ఉన్నారు. ఇన్ని రోజులు శైలు శిక్ష అనుభవిస్తున్నా తన పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదని, తనను కలవడానికి కూడా అఖిలేశ్ జైల్కు రాలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అసలు ఆజంఖాన్ జైలు నుంచి బయటికి రావడం అఖిలేశ్కు ఏమాత్రం ఇష్టం లేదని, ఒకవేళ అఖిలేశ్ తలుచుకుంటే ఎప్పుడో బయటికి వచ్చేసే వారని ఆయన వర్గీయులే వ్యాఖ్యానించారు.