చండీగడ్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ విభాగంలో విభేదాలు, అంతర్గత పోరుతో తాను చాలా తీవ్రంగా బాధపడ్డానని ఆయన తెలిపారు. గురుహర్సాహై నుండి ఎమ్మెల్యేగా ఉన్న సోధి, సెప్టెంబర్లో సీఎం పదవికి రాజీనామా చేసి, నవంబర్లో పార్టీని వీడిన అమరీందర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా పని చేశారు. ‘పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు, అంతర్గత పోరుతో నేను తీవ్రంగా బాధపడ్డాను’ అని సోనియా గాంధీకి రాసిన లేఖలో సోధి పేర్కొన్నారు. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితులకు కలత చెంది, తక్షణమే అమలులోకి వచ్చేలా పార్టీ పదవులన్నింటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని సోధి తెలిపారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, భూపేందర్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు.