న్యూదిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన కేబినెట్లోని అత్యున్నతస్థాయి మంత్రులతో సమావేశమయ్యారు. 12 మంది విపక్ష రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో తాము అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు. మోదీ మంగళవారం కూడా సీనియర్ కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. 12 మంది రాజ్యసభ సభ్యులను పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలంతా యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి, ఉమ్మడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, శివసేన, టీఆర్ఎస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్సీ, ఎల్జేడీ, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాల సమావేశాలకు దూరంగా ఉన్న టీఎంసీ కూడా పాల్గొనడం విశేషం. రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ను ఉపసంహరించాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.