కేంద్రం తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
ఓబీసీలపై బీజేపీ శీతకన్ను
పాట్నా : బీసీ వర్గాల కుల గణన కష్టమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పినప్పటి నుంచి బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఫలితంగా ఎన్డీయే కూటమిలో వివాదాలు మొదలయ్యాయి. కులగణనపై మీ వైఖరిని మూడు రోజుల్లో తెలపాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డెడ్లైన్ విధించారు. నితీశ్ కుమార్ తన వైఖరిని వెల్లడిరచిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన కులగణన సాధనకు కలిసిరావాలని బీజేపీయేతర పార్టీలకు పిలుపునిచ్చారు. తామంతా కలిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. శనివారం బీజేపీయేతర పార్టీలకు చెందిన 33 మంది సీనియర్ నేతలకు తేజస్వి యాదవ్ లేఖ పంపారు.
వెనుకబడిన వర్గాల కులగణన జాతినిర్మాణానికి కీలకమని, భారత్ వంటి దేశాల్లో ఆందోళనకర అంశాల్లో ముందున్న కులగణనను అత్యవసరమైనదిగా పరిగణించాలని అందులో పేర్కొన్నారు. సామాజిక సామరస్యతకు, సామాజిక సంబంధాలకు ఇది ఎంతగానో దోహదం అవుతుందన్నారు. ఆయన లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రాం మాంరీa, లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏఐఏడీఎంకే నేత ఒ.పన్నీర్సెల్వం తదితరులు ఉన్నారు. బీసీల కుల గణన విషయంలో మనమంతా చేతులు కలపాలని, ప్రభుత్వంపై ఐక్యంగా ఒత్తిడి తేవాలని బీజేపీయేతర పార్టీల నేతలను లేఖ ద్వారా తేజస్వి కోరారు. ఈ విషయంలో మీరంతా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. కుల గణన డిమాండుపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇదిలావుంటే, ఆర్జేడీ దాని సీనియర్ నేతలంతా కుల గణన నిర్వహించేలా కేంద్రాన్ని డిమండు చేయాలని నితీశ్ కుమార్పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆగస్టు 28న నితీశ్ కుమార్ సహా జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ సహా 11 ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని బీహార్ అసెంబ్లీ ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఆర్జేడీ ప్రవేశపెట్టింది. కేంద్రం తీరు నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
లెక్కలు ఇవ్వని బీజేపీ విమర్శించడమా? : శివసేన
ముంబై : ఓబీసీ జనాభా లెక్కలు రూపొందించడం కష్టమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించడాన్ని శివసేన తప్పుపట్టింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించని బీజేపీ ఓబీసీ రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం ఏమిటని ప్రశ్నించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. 2011 నాటి సామాజిక, ఆర్థిక, కులపరమైన జనాభా లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, వాటిని సమర్పించడం పరిపాలనపరంగా కష్టసాధ్యమని కేంద్రం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ఈ వివరాలు కావాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన దావాపై కేంద్రం ఆ విధంగా సమాధానం ఇచ్చింది. ఓబీసీ వివరాలు ఇవ్వడానికి ఇష్టపడని బీజేపీ..స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కాలేదంటూ విమర్శలు చేస్తోందని సామ్నా వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన అత్యవసర ఆదేశాలపై సంతకం చేసినందుకు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపింది.