ఉత్తర్ప్రదేశ్లోని మథురలో కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో తొక్కిసలాట చోటుచేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మథురలోని బంకే బిహరీ ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జన్మాష్టమి వేడుకలను నిర్వహించగా.. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హారతి ఇస్తున్న సమయంలో భక్తులు ఎగబడటం తొక్కిసలాటకు దారితీసిందని మథుర సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ‘‘బంకే బిహరీ ఆలయం వద్ద జరిగిన జన్మాష్టమి వేడుకల్లో హఠాత్తుగా భక్తుల పెద్ద సంఖ్యలో దూసుకొచ్చారు. హారతి ఇస్తున్న సమయంలో రద్దీ పెరిగిపోయి పరిస్థితి అదుపుతప్పింది.. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ, ఓ పురుషుడు ఊపిరాడక మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు.. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు.