బెంగళూరు : తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ భౌతికకాయానికి ఇక్కడి కమాండ్ ఆస్పత్రి వద్ద కర్ణాటక గవర్నర్ తవార్చాంద్ గెహ్లాట్, మిలటరీ, ప్రభుత్వ అధికారులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక్కడి నుంచి భౌతికకాయాన్ని భోపాల్ పంపేందుకు బెంగళూరులోని యెలహంక ఎయిర్ఫోర్స్ బేస్కు తరలించారు. అక్కడ వరుణ్సింగ్కు ఐఏఎఫ్ ఘనంగా నివాళులర్పించింది. భారత వాయుసేనలోని ఉన్నతాధికారులు, సైనికులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వరుణ్ సింగ్ భౌతికకాయాన్ని వాయుమార్గంలో మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించారు. శుక్రవారం అక్కడ వరుణ్సింగ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
మృత్యువుతో పోరాడి..
డిసెంబర్ 8న తమిళనాడు కూనూర్ సమీపంలో వాయుసేనకు చెందిన హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది చనిపోయినట్లు వాయుసేన అదేరోజు ప్రకటించింది. భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సిబ్బంది మరణించారు. తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్కు తొలుత వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజులకు బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం ఆయన కన్నుమూశారు.
లోక్సభ సంతాపం
ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ మృతికి లోక్సభ గురువారం సంతాపం తెలిపింది. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా వరుణ్సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.