చండీగఢ్: భారత సరిహద్దు దళాల (బీఎస్ఎఫ్) అధికార పరిధిని పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి అనుమతి ఇవ్వడంపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై పంజాబ్ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్యని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చన్నీ డిమాండ్ చేశారు. సోమవారం పంజాబ్ రాజధాని చండీగఢ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ‘పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలికి బీఎస్ఎఫ్కు అధికార పరిధిని పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పంజాబీలను అసంతృప్తికి గురి చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని చన్నీ అన్నారు.
వాటర్ బిల్లులమాఫీ
వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న పంజాబ్ ప్రభుత్వం సోమవారం ఆ రాష్ట్రప్రజలకు శుభవార్త అందించింది. గ్రామ, పట్టణాలతో సహా ఇప్పటి వరకూ ఉన్న వాటర్ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,800 కోట్ల భారం పడనుంది. దీనితో పాటునెలకు రూ.50చొప్పున నీటి తారీఫ్ను నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. నీటి సరఫరా కోసం వినియోగించే విద్యుత్ బిల్లులను రాష్ట్రప్రభుత్వమే కడుతుందని పేర్కొన్నారు. అలాగే గ్రూప్`డి ఉద్యోగాల నియామకాలను కూడా పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.