కోజికోడ్ : నిఫా వైరస్తో మృతి చెందిన 12 ఏళ్ల బాలుడి మృతదేహానికి ఆరోగ్య సిబ్బంది సమీపంలోని కన్నాంబరత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగానే కొద్దిమంది దగ్గరి బంధువులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలుడి అంత్యక్రియల అనంతరం కోజికోడ్ కార్పొరేషన్ ఆరోగ్య సిబ్బంది ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. అంతకుముందు మృతదేహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన చేసిన 12 అడుగుల లోతు గొయ్యిలో ఖననం చేశారు. సమీపంలోని మావూర్కు చెందిన బాలుడు ఆదివారం తెల్లవారుజామున ఇక్కడి ఆసుపత్రిలో నిపాతో మరణించాడు. బాలుడి నమూనాల్లో నిఫా వైరస్ ఉన్నట్లు పూనేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. దీంతో కోజికోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు.
మరో ఇద్దరికి నిఫా లక్షణాలు నిఫా వైరస్ లక్షణాలున్న మరో ఇద్దరిని గుర్తించినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. మరణించిన 12 ఏళ్ల బాలుడితో ఉన్న 20 హై రిస్క్ కాంటాక్ట్లలో ఈ ఇద్దరూ ఉన్నారని ఆమె చెప్పారు. ‘మేము ఇప్పటి వరకు 188 కాంటాక్ట్లను గుర్తించాం.. నిఘా బృందం వారిలో 20 మందిని హై రిస్క్ కాంటాక్ట్లుగా పేర్కొంది. ఈ ఇద్దరు హై రిస్క్ కాంటాక్ట్లలో నిపా లక్షణాలు ఉన్నాయి. ఇద్దరూ ఆరోగ్య కార్యకర్తలు. ఒకరు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మరొకరు కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ స్టాఫ్ మెంబరు’ అని మంత్రి మీడియాకు వివరించారు. సాయంత్రం వరకు మొత్తం 20 హై రిస్క్ కాంటాక్ట్లను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి బదిలీ అవుతారని ఆఆమె చెప్పారు.