న్యూదిల్లీ: దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా, తీవ్రత ప్రజలు ఆస్పత్రిలో చేరే రేటు తక్కువగానే ఉందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ గురువారం తెలిపారు. దీనికి వాక్సిన్లు, సహజంగా పెరిగిన వ్యాధి నిరోధక శక్తే కారణమని పేర్కొన్నారు. పలు సర్వేలు చూపిస్తున్న విధంగా చిన్నపిల్లల్లో కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెద్దల్లో, పిల్లల్లో వ్యాధి తీవ్రత దాదాపు ఒకే విధంగా ఉందని ఆయన తెలిపారు. ‘దిల్లీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నా, ప్రజలు ఆస్పత్రిలో చేరే రేటు, తీవ్రత తక్కువగానే ఉంది. ఎందుకంటే దాదాపు ప్రజలంతా టీకాలు వేయించుకున్నవారే. అదీకాకుండా సహజసిద్ధంగా వారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరగడం ఒక కారణం. అందుకే పరిస్థితి అంతా అదుపులోనే ఉంది’ అని సత్యేంద్రజైన్ తెలిపారు. అంతకుముందు దిల్లీలో 5వేల తాజా కేసులు ఉండగా, వెయ్యి మంది ఆస్పత్రిలో చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కరోనా బాధితులకు వివిధ ఆస్పత్రుల్లో 9,390 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో కేవలం 148 మాత్రమే వినియోగించుకున్నారని వివరించారు.