కర్నాటకలో వివాదం కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్యతా సందేశాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. హిజాబ్ ధరించిన విద్యార్ధిని చేయి పట్టుకుని కొందరు బాలికలు నడిచివస్తున్న పోటోను ఆయన షేర్ చేస్తూ యునైటెడ్ వి స్టాండ్..మై ఇండియా అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఇవాళ శివమొగ్గ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోకి హిజాబ్ ధరించిన కొందరు విద్యార్ధినులు దూసుకొచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం సమర్పించనున్నారు.శివమొగ్గలోని పలు స్కూళ్లు, కాలేజీల వెలుపల హిజాబ్ ధరించిన విద్యార్ధినులు నిరసనలకు దిగారు.
ఉడిపి మహిళా ప్రీ యూనివర్సిటీ కాలేజీలోకి హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అనుమతించకపోవడంతో ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం మొదలైంది. ఆపై ముస్లిం యువతులు తరగతి గదులకు హిజాబ్తో రావడం, అందుకు ప్రతిగా హిందూ విద్యార్ధులు కాషాయ శాలువాలు కప్పుకుని వచ్చిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీయడంతో మూడు రోజుల పాటు విద్యాసంస్ధల మూసివేతకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ముస్లిం బాలికలు కొందరు కర్నాటక హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.