హైదరాబాద్ : కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై డబ్ల్యుహెచ్ఓ నిపుణులు అక్టోబరు 6న సమావేశం కానున్నారు. అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్) కోసం దరఖాస్తు చేసుకున్న భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ టీకాపై ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డబ్ల్యుహెచ్ఓకి సలహాలిచ్చే ఇమ్యునైజేషన్ నిపుణుల వ్యూహాత్మక సలహా బృందం (ఎస్ఏజీఈ) ‘కొవాగ్జిన్’ టీకా మూడు దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను విశ్లేషించనుంది. ఇప్పటికే టీకాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యుహెచ్ఓకు అందించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. అక్టోబరు 6న నిర్వహించనున్న సమావేశంలోనే భారత్ బయోటెక్ కూడా టీకాకు సంబంధించిన అంశాలను నిపుణుల బృందానికి వివరించనుంది. ఈ భేటీలో అందిన సమాచారంపై డబ్ల్యుహెచ్ఓ సంతృప్తి చెందితే ఎస్ఏజీఈ అత్యవసర వినియోగంపై సిఫార్సు చేస్తుంది. సిఫార్సు జరిగితే కోవిడ్-19 అత్యవసర వినియోగ టీకాల జాబితాలో కొవాగ్జిన్ చేరుతుంది.