న్యూదిల్లీ : కొవిడ్ వేళ ఆశాకిరణంగా ‘యోగా’ ఉందని, మహమ్మారితో పోరాడగలమనే నమ్మకాన్ని ఇది కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా నుంచి పోరాడేందుకు యోగాను రక్షణ కవచంగా మార్చుకోవాలని ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు మోదీ సందేశమిచ్చారు. ప్రతి దేశం, సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని, వ్యక్తిగత క్రమశిక్షణను అలవర్చుకుంటుందని చెప్పారు. ఈ సంద్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థత (డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి రూపొందించిన ‘ఎంయోగా’ యాప్ను ఆవిష్కరించారు. ప్రపంచంలోని అన్ని భాషల్లో ‘కామన్ యోగా ప్రోటోకాల్’ ఆధారంగా యోగా శిక్షణ వీడియోలు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎం
యోగా ద్వారా ప్రపంచానికి యోగా వాపిస్తుందని, ఇది ‘ఒక ప్రపంచం` ఒక ఆరోగ్యం’ నినాదానికి తోడ్పడుతుందన్నారు. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా బలం, సానుకూల ధోరణి పెంచుకునేలా యోగా మార్గమవుతుందన్నారు.
ప్రపంచానికి భారత్ ఇచ్చే గొప్ప కానుకల్లో యోగా ఒకటని, కొవిడ్ కాలంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. అంరత్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ ఆసనాలు చేస్తున్న ఫొటోను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
‘ప్రాణాయామం’ వంటి యోగా ఆసనాలను నేర్పుతూ ఆన్లైన్ తరగతులను అనేక స్కూళ్లు నిర్వహిస్తున్నాయని, కొవిడ్పై పోరాడేందుకు పిల్లలకు యోగా సహాయ పడుతుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబారాలు.. యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.
యోగా ఫర్ వెల్ నెస్(ఆరోగ్యం కోసం యోగా) థీమ్తో యోగా దినోత్సవాన్ని నిర్వహించిన్నట్లు మోదీ తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలనేది ఈ నినాదం ఉద్దేశమన్నారు. యోగా డే సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద 3వేల మందికిపైగా చేరుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆసనాలు చేశారు. ప్రపంచం మొత్తం ఈ రోజును జరుపుకున్నప్పటికీ టైమ్స్స్వ్కేర్ చాలా ప్రత్యేకమని భారతీయ దౌత్యాధికారి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సంబురాల్లో భాగంగా యోగా డేన ప్రత్యేక కార్యక్రమాన్ని వర్చువల్గా ఖాట్మండులోని భారతీయ రాయబార కార్యాలయం నిర్వహించింది. తమిళనాడు కొయంబత్తూరులో పీపీఈ కిట్లు ధరించివున్న కొవిడ్ రోగులు ఆసనాలు చేయగా… లఢక్ మంచులో ఐటీబీపీ జవాన్లు సూర్యనమస్కారం చేశారు. యోగాను మన జీవితంలో భాగంగా చేసుకుందామన్న సందేశాన్ని గోవా, ఉత్తరప్రదేశ్, దిల్లీ, చత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇచ్చారు. 2014 డిసెంబరులో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత్ చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలిపాయి.