కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూదిల్లీ : కోవిడ్`19 టీకా కేంద్రాల నిర్వహణ కోసం ఎటువంటి కాల పరిమితి లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అందుబాటుపై ఆధారపడి ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు టీకా కేంద్రాలు పని చేస్తాయని తెలిపింది. కోవిడ్ టీకా కేంద్రాలు (సీవీసీఎస్) ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పని చేస్తాయనే అభిప్రాయం ఉందని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ‘ఈ విషయంలో సీవీసీల కార్యాచరణకు ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదని పునరుద్ఘాటించవలసి ఉంది. సెషన్ సమయాలు నిర్ధిష్ట సీవీసీలు వద్ద డిమాండ్, అవసరానికి లోబడి ఉంటాయి. కేసులు పెరిగిన డిమాండ్ విషయంలో బహుళ అవసరాన్ని తీర్చడానికి ప్రతి ఒక్క సీవీసీ వద్ద బృందాలను ఏర్పాటు చేయవచ్చు. సీవీసీల సమయాలు అనువైనవని, మానవ వనరులు, మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా రాత్రి 10 గంటల వరకు ఉండవచ్చని మళ్లీ పునరుద్ఘాటించబడిరది’ అని అగ్నాని చెప్పారు. అలాగే, దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, అన్ని స్థాయిలలో కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ)కి అనుగుణంగా ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అగ్నాని సూచించారు. టీకా కేంద్రాల వద్ద క్యూలు, వేచి ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయని నిర్ధారించుకోవాలని సూచించారు. ‘జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం కింద భద్రత, నాణ్యతను నిర్ధారించడంతోపాటు పౌరుల సౌకర్యాన్ని పెంచే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి. టీకా కార్యక్రమానికి సంబంధించి కొత్త మైలు రాళ్లను సాధించడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ నిరంతర మద్దతు ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఎన్నికల విధుల కోసం నియమించబడిన సిబ్బందితో సహా ఫ్రంట్లైన్ కార్మికులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి దేశవ్యాప్తంగా సోమవారం కోవిడ్ టీకా మూడవ మోతాదు(ముందస్తు జాగ్రత్త డోసు) పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయస్సు వారికి టీకా డోసులను అందిస్తున్నారు.