న్యూదిల్లీ: పవిత్ర గంగను ఐదు రాష్ట్రాల్లోని 1080 కంపెనీలు కలుషితం చేస్తున్నాయని, వాటిలో 195 కంపెనీలు మూసివేయగా, 165 కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని కేంద్రం సోమవారం తెలిపింది. 165 కంపెనీల్లో తొమ్మిది కంపెనీలకు మూసివేయమని ఆదేశాలు జారీ చేయగా, 156 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వివరించింది. రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశర్ తుడు మాట్లాడుతూ రోజుకు 280.17 మిలియన్ లీటర్ల కలుషిత నీరు గంగలో కలుస్తోందని, దాన్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) రోజుకు 6.8 టన్నులు ఉంటోందని వివరించారు. 2020`21లో కనుగొన్న దాని ప్రకారం, గంగ ప్రవహిస్తున్న ఐదు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని 1080 కాలుష్యకారక పరిశ్రమలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో నోటీసులు జారీ చేశామని తుడు వివరించారు. కాలుష్య కారక పరిశ్రమలను సాంకేతిక సంస్థల సహాయంతో అక్టోబరు 2020 నుంచి మార్చి 2021 వరకూ తనిఖీలు నిర్వహించి, రాష్ట్రాల పర్యావరణ బోర్డుల సాయంతో చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరిచారు.