సీఎస్ఐఆర్, సీసీఎంబీ పరిశోధనలో గుర్తింపు
వెలుగులోకి తాజా అధ్యయన ఫలితాలు
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తాజాగా తెలుసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సీఎస్ఐఆర్-సీసీఎంబీ, చండీగఢ్ కు చెందిన సీఎస్ఐఆర్-ఐఎంటెక్, హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల సహకారంతో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలు ఎయిరోసాల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. నిజానికి కరోనా వైరస్ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందన్న దానికి ఇతమిద్దమైన ఆధారాల్లేవు. ఉపరితలం, నీటి తుంపర్ల రూపంలో వైరస్ ఉన్న వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తున్నట్టు గత పరిశోధనల్లో గుర్తించారు. కానీ, కరోనా వైరస్ సూక్ష్మ కణాల రూపంలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న దానికి లోగడ ఆధారాలు లభించలేదు. కానీ, తాజా అధ్యయనం గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించింది. హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల (కరోనా బాధితులున్న) ప్రాంతాల నుంచి గాలి నమూనాలను సేకరించి, జీనోమ్ కంటెంట్ ను పరీక్షించారు.