పనాజి: గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ వరుసగా రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పనాజీ సమీపాన బాంబోలిమ్లోని డా.శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై… ముఖ్యమంత్రితో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో వాల్పోయి ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే, దబోలిమ్ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో, పోండా ఎమ్మెల్యే రవి నాయక్, కర్చోరెమ్ ఎమ్మెల్యే నీలేష్ కబ్రాల్, శిరోడా ఎమ్మెల్యే సుభాష్ శిరోద్కర్, పోర్వోరిమ్ ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే, పనాజీ ఎమ్మెల్యే అటనాసియో ాబాబుష్్ణ మాన్సెరేట్, ప్రియోల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (ఈయన గోవాకు చెందినవారు), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా దాదాపు 10వేల మంది హాజరయ్యారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి ఇది వరుసగా మూడోసారి.