గ్యాస్ సిలిండర్ ధర పెంపు వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ ధర చాలా పెరిగింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ. 1,110 చెల్లించుకోవాలి. ఇటీవల కూడా సిలిండర్ ధర రూ. 50 మేర పైకి చేరింది. ఇలా గ్యాస్ సిలిండర్ రేటు పెంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్ సిలిండర్ రేటు మన దేశంలోనే తక్కువగా ఉందని పేర్కొనడం గమనార్హం. ప్రపంచం దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధర తక్కువగా ఉందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గ్లోబల్గా చూస్తే మన దేశంలో వంట గ్యాస్ ధర పెరుగుదల తక్కువ అని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పైకి చేరాయని తెలిపారు. అలాగే ఈయన ఏడు దేశాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మన దేశంలోని ధరలతో పోల్చి చూపుతూ ట్వీట్ కూడా చేశారు.
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూలై 6న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. దీంతో కుకింగ్ గ్యాస్ రేటు ఢల్లీిలో రూ. 1053కు చేరింది. ముంబైలో రేటు రూ. 1002 నుంచి రూ. 1052కు ఎగసింది. అలాగే సిలిండర్ రేటు కోల్కతాలో రూ. 1029 నుంచి రూ. 1079కు చేరింది. ఇంకా చెన్నైలో ఈ రేటు రూ. 1068గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ రేటు రూ. 1110కు చేరింది.