చండీగఢ్/జైపూర్ : పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో శుక్రవారం తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. సాధారణకంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హరియాణాలోని హిస్సార్లో విపరీతమైన చలి నెలకొంది. ఇక్కడ 2.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ విభాగం నివేదిక పేర్కొంది. కర్నాల్, రోప్ాతక్, గుర్గ్రావ్, ఫతేబాద్, పంచకుల, భివానిలో వరుసగా 4.2 డిగ్రీల సెల్సియస్, 4.2, 5, 4.3, 4.8, 4.9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్ర రాజధాని చండీగఢ్లో 4.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. పంజాబ్లో అమృత్సర్, లూథియానా, పటియాలా, రూప్నగర్, ఫరీద్కోట్, గురుదాస్ పూర్, జలంధర్లలో వరుసగా 4.8 డిగ్రీల సెల్సియస్, 6 డిగ్రీల సెల్సియస్, 4.8, 2.8, 4.8, 4.3, 5.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.
రాజస్థాన్లోని ఫతేపూర్లో 0.7 డిగ్రీల సెల్సియస్
రాజస్థాన్కు చెందిన అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలి వాతావరణం కొనసాగుతోంది. చురు జిల్లాలోని ఫతేపూర్ గురువారం రాత్రి 0.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. కరౌలి, అల్వార్, సంగ్రారియా(హనుమాన్ఘర్), చురుల్లో వరుసగా 1.1, 2.5, 2.9, 3.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పిలానీ, నాగౌర్, ధోల్పూర్, చిత్తోర్ఘర్, జైపూర్ల్లో వరుసగా 4.9, 5, 5.1, 6.6, 7.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ విభాగం పేర్కొంది.
కశ్మీర్లో కొంత ఉపశమనం
కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత మెరుగుపడటంతో తీవ్రమైన చలి గాలుల నుంచి కొంత ఉపశమనం కలిగింది. శ్రీనగర్లో గురువారం రాత్రి మునుపటి రోజుకంటే ఒక డిగ్రీ పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 3.0 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్లోని ప్రసిద్ధ స్కైయింగ్ రిసార్ట్ గుల్మార్గ్లో 9.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక వార్షిక అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ అయిన పహల్గామ్లో మైనస్ 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయినట్లు వివరించారు. కశ్మీర్ లోయకు ప్రధాన ద్వార పట్టణమైన ఖాజీగుండ్లో మైనస్ 3.0 డిగ్రీల సెల్సియస్, దక్షిణ కశ్మీర్ పట్టణం కోకర్నాగ్ సమీపంలో కనిష్ఠంగా మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్, దక్షిణ కశ్మీర్లోని కుప్వారా వద్ద మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. కాగా జనవరి 2, 3 తేదీల్లో కశ్మీర్కు చెందిన అనేక ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. అలాగే జనవరి 4వ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయని వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు పడుతుందని పేర్కొంది. కశ్మీర్ ప్రస్తుతం డిసెంబర్ 21న ప్రారంభమైన ‘చిల్లాఇ
కలాన్’ అనే పిలవబడే 40 రోజుల కఠినమైన శీతాకాల వాతావరణంలో ఉంది.