న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 2న మీరట్లో మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) శుక్రవారం తెలిపింది. మీరట్లోని సర్ధానా పట్టణానికి చెందిన సలావా, కైలీ గ్రామాల మధ్య రూ.700 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. క్రీడా సంస్కృతిని పెంపొందించడం, దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను నెలకొల్పడం ప్రధాన మంత్రి దృష్టి సారించే ముఖ్యమైన అంశాలలో ఒకటని, మీరట్లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఈ దార్శనికతను నెరవేర్చే దిశగా ఒక ప్రధాన అడుగు అవుతుందని పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రీడా విశ్వవిద్యాలయంలో సింథటిక్ హాకీ, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, కబడ్డీలకు మైదానాలు, లాన్ టెన్నిస్ కోర్ట్, జిమ్నాజియం హాల్, సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్తో సహా ఆధునిక, అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలు ఉంటాయి. అలాగే బహుళ ప్రయోజనకరంగా ఉండేందుకు ఒక హాల్, సైక్లింగ్ వెలోడ్రోమ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. షూటింగ్, స్క్వాష్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, కానోయింగ్, కయాకింగ్ వంటి వాటికి ఇతర సౌకర్యాలను కూడా కలిగి ఉంటుంది. 540 మంది మహిళలు, 540 మంది పురుష క్రీడాకారులతో సహా 1,080 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సామర్థ్యాన్ని విశ్వవిద్యాలయం కలిగి ఉంటుందని వివరించింది.