జమ్ముకశ్మీర్లోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న చవల్కాన్లో, హంద్వారా జిల్లాలోని నెచమా, గందర్బాల్ జిల్లాలోలోని సెర్చ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని పట్టుకున్నామని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ తెలిపారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టామన్నారు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదిని పట్టుకున్నామని చెప్పారు. వారిని జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించామన్నారు. ఇక హంద్వారాలోని నెచామా, రాజ్వార్ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హతమైనట్లు తెలిపారు. గండర్బాల్ జిల్లాలోని సెర్చ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడని తెలిపారు. ఉగ్రవాదులకోసం ఆ ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.