న్యూదిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గిరీశ్ తకోర్లాల్ నానావతి శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దేశంలో సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు, 2002లోని గోధ్రా అల్లర్ల కేసును ఆయన దర్యాప్తు చేశారు. జస్టిస్ నానావతి అర్ధరాత్రి 1.15 గంటలకు గుజరాత్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1935 ఫిబ్రవరి 17న జన్మించిన నానావతి..1958 ఫిబ్రవరి 11న బోంబే హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1979 జులై 19న గుజరాత్ హైకోర్టు శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 1993 డిసెంబరు 14న ఒడిశా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1994 జనవరి 31న ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1994 సెప్టెంబరు 28న కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ అయ్యారు. 1995 మార్చి 6 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నానావతి…2000 ఫిబ్రవరి 16న పదవీ విరమణ చేశారు. 2002 నాటి గోద్రా అల్లర్లపై జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతా తమ తుది నివేదికను 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్కు సమర్పించారు. గోధ్రా అల్లర్లలో 1000మందికి పైగా హత్యకు గురైన విషయం విదితమే. గోధ్రా అల్లర్లపై విచారణకు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ కమిషన్ను నియమించారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దర్యాప్తునకు ఎన్డీఏ ప్రభుత్వం జస్టిస్ నానావతిని నియమించింది. నానావతి కమిషన్గా ఇది ప్రసిద్ధి చెందింది.