కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్
న్యూదిల్లీ : వచ్చే సంవత్సరం జూన్ తర్వాత కూడా జీఎస్టీ పరిహారం కాలాన్ని పొడిగించాలని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ శనివారం ఉద్ఘాటించారు. రాష్ట్రం ఇప్పటికే గణనీయమైన ఆదాయం కొరతతో సతమతమవుతోందని అన్నారు. ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం వికేంద్రీకరణ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి బకాయిలు అందలేదని తెలిపారు. కేరళ జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) పరిహారాన్ని రూ.13 వేల కోట్లకు పైగా పొందనున్నదని, అయితే మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19 వేల కోట్లకు పైగా మరొక వన్ టైమ్ గ్రాంట్ మంజూరు అవుతుందని ఆయన తెలిపారు. ఒకవేళ వచ్చే సంవత్సరం జీఎస్టీ పరిహారం ముగిస్తే, రాష్ట్రం మరింత ఆదాయ కొరతను ఎదుర్కొంటుందని అన్నారు. పరిహారం కాలాన్ని పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం గడువు వచ్చే ఏడాది జూన్తో ముగుస్తుంది.