డిసెంబర్లో 13 శాతం పెరిగిన ఆదాయం
న్యూదిల్లీ : వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం డిసెంబర్లో రూ.1.29 లక్షల కోట్లకు పైగా వసూలయిందని, గత ఏడాది ఇదే నెలకంటే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. నవంబర్లో జీఎస్టీ వసూలు 1.31 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, డిసెంబర్కు వరుసగా ఆరవ నెలలో విక్రయించిన వస్తువులు, అందించిన సేవల ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ 2021లో వసూలయిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,29,780 కోట్లు, ఇందులో సీజీఎస్టీ రూ.22,578 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.28,658 కోట్లు, ఐజీఎస్టీ రూ.69,155 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.37,527 కోట్లతో సహా), సెస్ రూ.9,389 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.614 కోట్లతో సహా)’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 2021 ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో (రూ.1.15 లక్షల కోట్లు) జీఎస్టీ ఆదాయాలు కంటే 13 శాతం ఎక్కువ. డిసెంబర్ 2019 కంటే 26 శాతం ఎక్కువ. ప్రస్తుత సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొదటి, రెండవ త్రైమాసికంలో వరుసగా రూ.1.10 లక్షల కోట్లు, రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లర్లపై చర్యలు మెరుగైన జీఎస్టీకి దోహదం చేస్తున్నాయి. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సరిచేయడానికి కౌన్సిల్ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యల వల్ల కూడా ఆదాయం మెరుగుపడిరది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత త్రైమాసికంలోనూ రాబడుల సానుకూల ధోరణి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.