ముంబై : మావోయిస్టులకు సంబంధం ఉన్న ఎల్గర్ పరిషత్ కేసులో ప్రముఖ సంఘసంస్కర్త సుధా భరద్వాజ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె మూడు సంవత్సరాలకు పైగా జైలులోనే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై నేరపూరిత కుట్ర చేశారన్న కేసులో భరద్వాజ్ (60) ముద్దాయి. ఆమెకు డిసెంబరు1న బోంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే భరద్వాజ్ విడుదలపై నిబంధనలు విధించాలంటూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును బోంబే హైకోర్టు సూచించింది. దీంతో బుధవారం రూ.50వేల పూచీకత్తుతో బెయిల్పై విడుదలయ్యేందుకు ఎన్ఐఏ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి బయటకు వచ్చారు. కారులో నిరీక్షిస్తున్న ఆమె, జైలు బయట ఉన్న మీడియా ప్రతినిధులను చేయి ఊపుతూ పలకరించారు. 2017, డిసెంబరు 31న పూణెలోని శనివార్వాడాలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశంలో భరద్వాజ్, ఇతరులు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ ప్రసంగాలు జరిగిన తరువాత రోజున నగర శివార్లలోని కోరెగావ్`బీమా స్మృతి వనం వద్ద గొడవలు జరిగాయి. ప్రాథమిక విచారణలో పోలీసులు ఈ సమావేశం వెనుక కచ్చితంగా మావోయిస్టుల హస్తం ఉందని ఆరోపించారు. అనంతరం ఈ కేసు జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) చేతికి వెళ్లింది. ఆగస్టు 2018న చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు అనుమతి లేకుండా ముంబైని విడిచి వెళ్లకూడదని, ఎన్ఐఏకు పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, మీడియాతో మాట్లాడకూడదని ఎన్ఐఏ కోర్టు నిబంధనలు విధించింది. అంతేకాకుండా తన కార్యాకలాపాలకు చెందిన ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు బోంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్పై ఎన్ఐఏ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసును విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. ఇదిలా ఉంటే సుధతో పాటు ఇతర ముద్దాయిలైన సుధీర్ ధవాలే, వెర్నోన్ గాసాల్వ్స్, అరుణ్ ఫెరియర, వరవరరావుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ప్రస్తుతం వరవరరావు మెడికల్ బెయిల్ పొందిన విషయం తెలిసిందే.