లఖింపూర్ ఖేరీ : గత ఏడాది ఉత్తర ప్రదేశ్కు చెందిన లఖింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతుల మీదకు ఎస్వీయూ వాహనాన్ని నడిపి హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా బెయిల్పై మంగళవారం జైలు నుండి విడుదలయ్యాడు. ఇతర ఖైదీలకు సాధారణ నిబంధనలకు విరుద్ధంగా అశిష్ మిశ్రా ఒక ఎస్యూవీలో జైలు వెనుక ద్వారం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాది అవదేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ కోర్టు రూ.3 లక్షల చొప్పున ఇద్దరి ష్యూరిటీ కోరిందని తెలిపారు. కానీ అశిష్ మిశ్రా నగరం విడిచి వెళ్లడానికి ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కాగా దిగువ కోర్టులు అభ్యర్థనలను తిరస్కరించడంతో అలహాబాద్ హైకోర్టు అతనికి గత వారం బెయిల్ మంజూరు చేసింది. నిబంధనలను పూర్తి చేసిన తర్వాత అతనిని జైలు నుండి విడుదల చేసినట్లు లఖింపూర్ ఖేరీ జైలు సూపరింటెండెంట్ పి.పి.సింగ్ విలేకరులకు తెలిపారు. టికోనియా జిల్లాలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసలో నలుగురు రైతుల హత్యకు సంబంధించిన కేసులో గత అక్టోబర్ నుండి అశిష్ మిశ్రా జైలులో ఉన్నాడు.