100 మార్కులు సాధించిన 14 మంది
తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ముగ్గురు
న్యూదిల్లీ : ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ-మెయిన్్2022 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పోటీ ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యత కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకారం, మొత్తం 14 మంది అభ్యర్థులు 100 మార్కులు సాధించారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టుగా తెలిపింది. జేఈఈ
మెయిన్2022 మెయిన్ మొదటి సెషన్లో గరిష్ఠంగా 100కి 100 మార్కులు సాధించిన వారిలో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి జాస్తి యశ్వంత్ వీవీఎస్, రూపేష్ బియానీ, అనికేత్ చటోపాధ్యాయ, ధీరజ్ కురుకుంద, ఏపీ నుంచి కొయ్యాన సుహాస్, పెనికలపాటి రవి కిశోర్, పోలిశెట్టి కార్తికేయ గరిష్ఠ మార్కులు సాధించారు. అలాగే 100 స్కోరు సాధించిన ఇతర అభ్యర్థులు బోయ హర్సేన్ సాత్విక్ (కర్ణాటక), కుషాగ్రా శ్రీవాస్తవ (జార్ఖండ్), మృణాల్ గార్గ్ (పంజాబ్), నవ్య (రాజస్థాన్), సౌమిత్ర గార్గ్ (ఉత్తరప్రదేశ్), సార్థక్ మహేశ్వరి (హరియాణా), స్నేహ పరీక్ (అసోం) ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 23 నుంచి 29 వరకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ
మెయిన్) 2022ని నిర్వహించింది. ‘పరీక్షకు 8.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా, 7.69 లక్షల మంది హాజరయ్యారు’ అని ఎన్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా ఎన్టీఏ స్కోరు, పొందిన మార్కుల శాతానికి సమానం కాదని వివరించారు. ‘ఎన్టీఏ స్కోర్లు బహుళ సెషన్ పేపర్లలో సాధారణీకరించబడిన స్కోర్లు, ఒక సెషన్లో పరీక్షకు హాజరైన వారందరి సాపేక్ష పనితీరుపై ఆధారపడి ఉంటాయి. పొందిన మార్కులు పరీక్షకుల ప్రతి సెషన్కు 100 నుంచి 0 వరకు స్కేల్గా మార్చబడతాయి’ అని ఆయన తెలిపారు. జేఈఈ మెయిన్లో టాప్లో నిలిచిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కి హాజరుకావచ్చు. అయితే ఇప్పుడు సెషన్1 ఫలితాలను మాత్రమే ఎన్టీఏ ప్రకటించింది. సెషన్
2 పరీక్ష తర్వాత అభ్యర్థుల ర్యాంక్లను ప్రకటిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ… జేఈఈ మెయిన్స్ సెషన్2 పరీక్షను జులై 21 నుంచి నిర్వహిస్తుంది. ఆ తర్వాత తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ప్రకటిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2022ను ఆగస్టు 28న నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది. జేఈఈ మెయిన్స్ సెషన్
1, సెషన్`2 పేపర్ల ఫలితాల ఆధారంగా టాప్ 2.45 లక్షల మంది విద్యార్థులు 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర ప్రభుత్వ-నిధులతో కూడిన ఇంజినీరింగ్ కాలేజీలలో ప్రవేశాలు పొందుతారు.