ఓటు హక్కును వినియోగించుకున్న మమతా
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ నుంచి లాయర్ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా పోటాపోటీ నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు భవానీ పూర్లో 57శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మమతాబెనర్జీ మధ్యాహ్నం 3 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. నందిగ్రామ్లో సుబేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమత..6 నెలల్లోగా ఎమ్మ్యెల్యేగా ఎన్నికల కావలసి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. భవానీపూర్తో పాటు జాంగీపుర్, సంషేర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నానికి జాంగీపూర్లో 53.78శాతం, సంషేర్గంజ్లో 57.15శాతం, పిప్లీలో 45.32శాతం ఓటింగ్ నమైదనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశాలోని పిప్లీలోనూ ఉపఎన్నిక జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదైంది.