కోల్కతా : కాంగ్రెస్పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాగ్బాణాలు ఆగడం లేదు. దిల్లీ వచ్చిన ప్రతిసారి సోనియాగాంధీని కలవాలా? యూపీఏ ఎక్కడుంది..? అంటూ కాంగ్రెస్పై ఆమె మొదలు పెట్టిన విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ పత్రిక జాగో బంగ్లా ఈ తరహాలోనే స్పందించింది. కాంగ్రెస్ యుద్ధంలో అలసి పోయిందని, పార్లమెంట్లో ప్రధాన విపక్షం చేయాల్సిన పని చేయడం లేదని వ్యాఖ్యలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే అసలైన కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చింది. బెంగాల్లో బీజేపీపై టీఎంసీ పోరాడి, విజయవంతమైంది. బీజేపీ విస్తరించిన రాష్ట్రాల్లోకి ఇప్పుడు టీఎంసీ ప్రవేశిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. కానీ ఆ పార్టీ బీజేపీని నిలువరించలేకపోయింది. కాంగ్రెస్ యుద్ధంలో అలసిపోయింది. అంతర్గత వర్గపోరుతో బాధపడుతోంది. ఇప్పుడు టీఎంసీ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను చేపట్టింది. తృణమూల్ కాంగ్రెసే అసలైన కాంగ్రెస్’ అని పార్టీ పత్రిక తెలిపింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అది దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రతిష్ఠను పెంచింది. ఈ క్రమంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గోవా, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పార్టీ పలుకుబడిని పెంచుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇందుకు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు తోడయినట్లు తెలుస్తోంది.